‘జగన్ గారు...ఏపీ పున:నిర్మాణమంటే ప్రజావేదక కూల్చినంత ఈజీ కాదు’
ABN , First Publish Date - 2022-02-18T18:29:27+05:30 IST
సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్రెడ్డి గారు, మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు’’ అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్గా ఉన్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్కి దిగజార్చారన్నారు. ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక-2022 వెల్లడించిందని తెలిపారు. ‘‘తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్ గారు! ఉద్యోగాల కల్పన అంటే మీ కుటుంబానికి, కులానికి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదు జగన్ రెడ్డి గారు’’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత కంపెనీలు రప్పించాలంటే కియా వాళ్లని బెదిరించినంత ఈజీ కాదన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమంటే ప్రజావేదిక కూల్చినంత సులువు కాదు ముఖ్యమంత్రి గారూ అంటూ లోకేష్ దుయ్యబట్టారు.