జగన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే...: Lokesh
ABN , First Publish Date - 2022-04-13T17:57:40+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలని లోకేష్ హితవు పలికారు.