జూమ్ మీటింగ్లో వైసీపీ నేతల ప్రత్యక్షంపై సీఐడీ అడిషనల్ డీజీపీకి వర్ల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-06-10T15:20:32+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు ప్రత్యక్షమవడంపై సీఐడీ అడిషనల్ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు ప్రత్యక్షమవడంపై సీఐడీ అడిషనల్ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య (Varla ramaiah) ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్లోకి చొరబడ్డారన్నారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.
వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీలు మీటింగ్లోకి అక్రమంగా చొరబడ్డారన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు లోకేష్తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారని అన్నారు. వారి అక్రమ చొరబాటు భయాందోళన కల్గిస్తూ నేరపూరిత కుట్రగా కనిపిస్తోందని వెల్లడించారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూసిన అధికార వైసీపీ నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.