వైసీపీకి ఇది తాత్కాలిక ఆనందం మాత్రమే: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-08-02T18:28:20+05:30 IST

వైసీపీకి ఇది తాత్కాలిక ఆనందం మాత్రమే: కళా వెంకట్రావు

వైసీపీకి ఇది తాత్కాలిక ఆనందం మాత్రమే: కళా వెంకట్రావు

అమరావతి: ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా  పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటం బాధాకరమని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదని... ఇది వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే అని వ్యాఖ్యానించారు. 5 కోట్ల ఆంధ్రుల తరపున రాజధానిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు మాట తప్పడం జగన్ మోసకారితనానికి, దివాళుకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. నాయకుడికి మాట మీద నిలబడే తత్వం, నైతిక విలువలు ముఖ్యమని... కానీ జగన్‌లో అవి ఏ కోశాన కూడా లేవు అనేది రాష్ట్ర ప్రజలకు మరోసారి బహిర్గతమైందని ఆయన తెలిపారు.


రూ.5తో అన్నం పెట్టడం చేతకాక అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల పొట్టకొట్టిన జగన్ 3 రాజధానులు ఎలా  కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై దుష్ర్పచారం చేసి ఇప్పటికే ఏడాదిన్నర కాలం వృధా చేశారన్నారు. ఇక మిగిలిన మూడున్నరేళ్ల కాలం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప మూడు బిల్డింగులు కూడా కట్టలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


మూడు రాజధానులతో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ది చెందుతుందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంత యువతకు ఎన్ని వేల ఉద్యోగాలొస్తాయని... ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అడిగారు. విశాఖలో నాలుగు భవనాలు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి పరిపాలన నిర్వహిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా అని నిలదీశారు. జగన్ అహంకారం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ.. తన పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి  ప్రజల మద్య చిచ్చు పెట్టి భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేస్తున్నారని కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2020-08-02T18:28:20+05:30 IST