ఏపీ ప్రజలకు వాతలతో పాటు కోతలు ఎక్కవయ్యాయి: Kala venkat rao
ABN , First Publish Date - 2022-02-18T20:04:36+05:30 IST
రాష్ట్ర ప్రజలకు వాతలతో పాటు కోతలు ఎక్కువయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలకు వాతలతో పాటు కోతలు ఎక్కువయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.11వేల కోట్లపై చిలుకు విద్యుత్ ఛార్జీల వాతలు ప్రజలకు పెట్టారన్నారు. 66 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే... సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ కోత విధిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చే రైతులు, గ్రామీణులకు ఇంటి అవసరాలకు విద్యుత్ లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి పంచాయితీలకు వచ్చిన దాదాపు రూ.23వేల కోట్లను విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం దండుకుందని విమర్శించారు. విద్యుత్ పేరుతో సమీకరించిన రూ.60వేల పైచిలుకు కోట్లు ఏం చేశారో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే విద్యుత్ కాదని అధిక ధరలకు కొనుగోలు చేయటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పరనిందలు మాని పనిచేసే విధానం జగన్ రెడ్డి నేర్చుకోవాలని కళా వెంకట్రావు హితవుపలికారు.