జగనన్న వసతి దీవెన కాదు...: జవహర్
ABN , First Publish Date - 2020-02-25T21:27:03+05:30 IST
ప.గో.: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కొత్త సీసాలో ..
ప.గో.: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కొత్త సీసాలో పాత సారా లాంటివని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన కాదని.. జగనన్న వంచన అని విమర్శించారు. టీడీపీ గతంలో ప్రవేశపెట్టిన పథకాన్నే పేరుమార్చి కొత్త స్కీమ్గా బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. డైట్ ఛార్జీల కింద నెలకు రూ 1,400 చొప్పున 10 నెలల్లో రూ. 14 వేలు ఇచ్చామన్నారు. దీనికి అదనంగా మరో రూ. 5వేలు కాస్మటిక్స్ కింద అందజేశామన్నారు. డైట్ ఛార్జీలను నెలకు రూ 1,400కు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.
తొమ్మిది నెలల పాలనతో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని జవహర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం చేసిందేమిటంటే.. గోదావరి బండ్ తవ్వి ఇసుక అక్రమ రవాణా చేయడమేనని అన్నారు. ఏసియాలో నెంబర్ టుగా ఉన్నటువంటి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ కిందే ఇసుక తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారని విమర్శించారు. అన్న క్యాంటిన్లు ఫోటోలు మార్చారు గాని అన్న క్యాంటీన్లు తెరవలేదని, పేదవాడి కడుపు మంట చల్లార్చలేకపోయారని జవహర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.