త్వరలోనే జగన్కు ముసలం తప్పదు: Jawahar
ABN , First Publish Date - 2021-07-22T18:22:47+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దురాగ్రహపూరితుడైన మూఢుడిలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన నివాసానికి ఎదురుగా ఉన్న గుడిసెలను నేలమట్టం చేయించి, పేదలను కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని మండిపడ్డారు. కోర్డు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా జగన్మోహన్ రెడ్డి పేదల గుడిసెలను నేల కూల్చారని అన్నారు. బైబిల్ నిబంధనలు అనుసరిస్తున్నానని చెప్పుకునే వ్యక్తి పేదల నివాసాలు కూలుస్తారా అని ప్రశ్నించారు. శివశ్రీ అనే మహిళకు ఏదైనా జరిగితే ఈ ముఖ్యమంత్రే బాధ్యుడవుతారన్నారు. తన వారిని కాపాడుకోవాలని, వారి సమస్యను అందరికీ తెలియజేయాలని చూసిన మహిళ ప్రాణాలకు వైసీపీ వారి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. అహంకారంతో విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి శ్మశానం వైపు చూస్తేమంచిదని హితవుపలికారు. ఏం చేసినా దళితులు నన్నేం చేస్తారులే అని జగన్ భావిస్తున్నారన్నారు. దళితుల చేతిలో త్వరలోనే ముఖ్యమంత్రికి ముసలం తప్పదని జవహర్ హెచ్చరించారు.