రహదారి బాగుచేయకుంటే ఆందోళన
ABN , First Publish Date - 2022-08-20T06:07:12+05:30 IST
లంక గ్రామాల ఆర్ అండ్ బీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు డిమాండ్ చేశారు.
కలిదిండి, ఆగస్టు 19 : లంక గ్రామాల ఆర్ అండ్ బీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం కలిదిండలో విలేకరులతో మాట్లాడుతూ గుర్వాయిపాలెం నుంచి పెదలంక వరకు 10 కిలోమీటర్ల మేర రహదారిపై పెద్ద గోతులు పడి వాహన చోదకులు అవస్థలు పడుతున్నారని, గుంతల్లో ఆర్టీసీ బస్సులు దిగబడటంతో అధికారులు బస్సులను నిలుపుదల చేస్తామని చెప్పారన్నారు. టీడీపీ హయాంలో లంక గ్రామాల రహదారి అభివృద్ధి పనులకు 2018లో రూ.20 కోట్లు మంజూరు చేయగా, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ నిధులను రద్దు చేసిందన్నారు. చేపలు, రొయ్యల ఎగుమతులకు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. తవుడు లోడు లారీలు గోతుల్లో దిగబడటంతో ట్రాక్టర్ల ద్వారా తోలడంతో అధిక వ్యయమవుతోందన్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.