Andhra news: శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ.. అందుకే : చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-21T20:20:09+05:30 IST
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
పశ్చిమగోదావరి: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని పెనుగొండ మండలం నడిపూడి ఎన్టీఆర్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ... విపత్తు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే జగన్ పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. దేశంలో అధిక ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని టీడీపీ అధినేత తెలిపారు.
శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ, అందుకే ఇంకా తిరుగుబాటు చేయలేదన్నారు. బాదుడే బాదుడు అంటూ జగన్ రెడ్డి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ గేర్లో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. 72శాతం పూర్తి అయిన పోలవరాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ముంపు మండలాల ప్రజలను ఈ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.