మూకుమ్మడి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి: Budda venkanna
ABN , First Publish Date - 2021-11-03T19:14:38+05:30 IST
బద్వేల్లో గెలిచామని వైసీపీ బాణసంచా కాల్చడం కామెడీ సినిమాను తలపించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: బద్వేల్లో గెలిచామని వైసీపీ బాణాసంచా కాల్చడం కామెడీ సినిమాను తలపించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. దొంగఓటర్లతో సాధించిన విజయానికి కూడా సంబరాలు చేసుకోవడం అధికారపార్టీకే చెల్లిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఎమ్మెల్యేలకు నిజంగా ప్రజల్లో అంతటి ఆదరాభిమానాలుంటే, మూకుమ్మడి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. జగన్కు ఓటేసినందుకు ప్రజలు ఇప్పటికే చెప్పులతో కొట్టుకుంటూ, తమ వేదనను సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారని తెలిపారు.
ప్రజలు తనకు మరోఛాన్స్ ఇవ్వరనే, జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఒక్కసారి అని ప్రాధేయపడ్డారని ఆయన అన్నారు. మద్యం, ఇసుక, గనులు, గంజాయి, మాదక ద్రవ్యాలు సహా ప్రజలపై వేస్తున్న పన్నుల ఆదాయమంతా తాడేపల్లి ప్యాలెస్కే చేరుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి, పీకేతో కలిసి ప్రణాళికలు వేస్తున్నారన్నారు. మహా పాదయాత్ర నిర్వహిస్తున్న వారికి ఏం జరిగినా అందుకు జగన్మోహన్ రెడ్డే బాధ్యులవుతారని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తప్ప, ఎక్కడా ఒక్క గ్రావెల్ రోడ్డు కూడా ఈ ప్రభుత్వం వేయలేదని బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు.