పేదవారి పథకాలన్నీ వైసీపీ నాశనం చేసేసింది: బొండా ఉమా

ABN , First Publish Date - 2020-10-01T18:31:30+05:30 IST

చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

పేదవారి పథకాలన్నీ  వైసీపీ నాశనం చేసేసింది: బొండా ఉమా

విజయవాడ: చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి భౌతికాయాన్ని  స్వగ్రామానికి పంపేవారని.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారన్నారు. చంద్రన్న భీమా, పెళ్లి పథకం, అన్న కాంటీన్ వంటి ప్రజా పథకాల్ని రద్దు చేసారని మండిపడ్డారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా చంద్రబాబు హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో అంతిమ యాత్ర భవన్ నిర్మించారని తెలిపారు. అద్దె ఇళ్లల్లో భౌతికకాయాన్ని ఉంచేందుకు యజమానులు ఒప్పుకునేవారు కాదని...వారికి అండగా ఉండి భౌతికకాయాన్ని సొంతవారు  చూసుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 70 లక్షలతో  ఆ భవన్‌ను నిర్మించారని చెప్పారు.  


16 నెలలలో వైసీపీ పాలనలో ప్రజలకు ఉపాయపగపడే పథకాలు ఏమి ప్రవేశపెట్టలేదని ఆయన విమర్శించారు. అడవిపందుల చేనులో పడితే ఎలా నాశనం అవుతుందో అలాగే పేదవారి పథకాలన్ని  వైసీపీ నాశనం చేసేసిందని మండిపడ్డారు. రజకులకు మొదటిగా రజక కల్యాణ మండపాన్ని నిర్మిస్తే సచివాలయం చేసారన్నారు. రజక కల్యాణ మండపాన్ని  తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. వారికంటూ మండపం ఉండటం ప్రభుత్వంకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ  కార్పొరేషన్‌లు తమ కుర్చీ తాము తెచ్చుకొనేటట్టు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ వారికీ లోన్లు ఇవ్వడంలేదన్నారు. ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.  గెలిపించిన వారినే ప్రభుత్వం  అణిచివేస్తుందని బొండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-01T18:31:30+05:30 IST