వైసీపీకి పోలీసుల వత్తాసు!

ABN , First Publish Date - 2021-03-04T06:50:04+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ గూండాగిరి చేస్తూ, ప్రత్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

వైసీపీకి పోలీసుల వత్తాసు!

ఇదే కొనసాగితే ఎన్నికలను బహిష్కరిస్తాం

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమ

విజయవాడ (పాయకాపురం), మార్చి 3: కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ గూండాగిరి చేస్తూ, ప్రత్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతూ, ప్రతిపక్షాలను అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉమా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సరళిపై అసహనం వ్యక్తం చేశారు. 28వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిని వీరమాచినేని లలిత, 31వ డివిజన్‌లో బరిలో ఉన్న సందిరెడ్డి గాయత్రి ప్రచారాలను అడ్డుకోవటమే కాకుండా ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులను చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన మద్యం, బయట నుంచి రప్పించిన గూండాలను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. డీజీపీ సైతం వైసీపీ ఆగడాలను అడ్డుకోవడం లేదని, పోలీసులే వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థినులపై వైసీపీ అల్లరి మూకలు పోలీసుల ముందే చెలరేగిపోతున్నా, అడ్డుకోలేని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉందని దుయ్యబట్టారు. డీజీపీ తక్షణం స్పందించాలని, లేకుంటే ఎన్నికలను బహిష్కరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థినులు సందిరెడ్డి గాయత్రి, వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T06:50:04+05:30 IST