విశాఖ రాజధాని అంటూ భూఆక్రమణలకు తెర: బండారు

ABN , First Publish Date - 2021-06-25T18:18:41+05:30 IST

విశాఖ భూములను కొల్లగొట్టి, అమ్మేసి ఆ సొమ్ముని ఇడుపులపాయకు, పులివెందులకు తరలించాలని చూస్తున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.

విశాఖ రాజధాని అంటూ భూఆక్రమణలకు తెర: బండారు

అమరావతి: విశాఖ భూములను కొల్లగొట్టి, అమ్మేసి ఆ సొమ్ముని ఇడుపులపాయకు, పులివెందులకు తరలించాలని చూస్తున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి, విజయసాయికి విశాఖపై ప్రేమాభిమానాలుంటే, నగరాభివృద్ధికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ముసుగులో విశాఖను రాజధాని చేస్తామంటూ భూఆక్రమణలు, అమ్మకాలకు తెరలేపారని విమర్శించారు. నెల్లూరు నుంచి వచ్చిన ఏ2ని జగన్మోహన్ రెడ్డి విశాఖలో పెట్టి, భూవ్యాపారానికి తెరతీశారని ఆరోపించారు. ఏపీ బిల్డ్ కార్పొరేషన్ పేరుతో నగరంలోని విలువైన భూములకు ఎసరుపెట్టారన్నారు. విశాఖ బీచ్ రోడ్ కారిడార్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వమిచ్చిన జీవో పచ్చిబూటకమని వ్యాఖ్యానించారు. దానితో ప్రజలను మోసగిస్తున్నారని ఆయన తెలిపారు.


విశాఖ బీచ్ కారిడార్ పరిధిలోని ఆస్తులను అమ్మి, ఆసొమ్ములను మింగేయాలని చూస్తున్నారన్నారు. పులివెందులలోని భూములు అమ్మకుండా, అక్కడ అభివృద్ధికి ప్రత్యేకనిధులు  ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. పాలకుల భూఆక్రమణలు, కబ్జాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నా, వారు తమ దోపిడీని ఆపడంలేదన్నారు. విశాఖ వాసులు ఎంతశాంతికాముకులైనా చూస్తూ ఊరుకుంటారనుకోవద్దని హెచ్చరించారు. జీతాలు చెల్లించలేని అసమర్థ ప్రభుత్వం రూ.5వేల కోట్లతో విశాఖను అభివృద్ధి చేస్తుందా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లు మోసపూరిత కార్పొరేషన్లే అని అన్నారు. వాటి ముసుగులో విశాఖలోని విలువైన భూములను కొట్టేయడమే పాలకుల అంతిమ లక్ష్యమని తెలిపారు. బ్రిటీష్ వారికంటే ఘోరంగా ముఖ్యమంత్రి, విశాఖ భూములను తనఖా పెట్టడానికి సిద్ధమయ్యారని బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-06-25T18:18:41+05:30 IST