సీఎం బయటకు వస్తే జనం బలవ్వాల్సిందే?: Achennaidu
ABN , First Publish Date - 2022-04-16T15:08:35+05:30 IST
ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే కనీసం దారి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్యం అందించడం ఆలస్యమై పండు అనే చిన్నారి మృతి చెందిందని, ఈ ఘటన చాలా బాధ కలిగించిందన్నారు. కనీసం బాధితులను పరామర్శించేంత ఓపిక, సమయం కూడా మంత్రికి లేదా అని నిలదీశారు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసుకుని లోపలే ఉండాలని హెచ్చరిస్తున్నారన్నారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామని.. ఇలాగే చేస్తామని అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల చేతిలో బడితపూజ తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.