నరసాపురం: వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ, జనసేన, వామపక్షాలు ఏకం కావాలని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్లలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలతో సంక్షేమం కుంటుపడడం, ధరల పెరుగుదల, వైసీపీ నేతల అరాచకాలకు ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రాష్ర్టాభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను దోచుకోవడమే ఏజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సంక్షేమం కన్నా బిహార్ తరహాలో పాలన సాగుతోందని షరీఫ్ ధ్వజమెత్తారు.