ప్రొఫెసర్కు ‘దేశం’ మద్దతు
ABN , First Publish Date - 2021-03-03T04:42:17+05:30 IST
ప్రొఫెసర్కు ‘దేశం’ మద్దతు
‘మండలి’ పోరులో కోదండరామ్కు టీడీపీ స్నేహహస్తం
ప్రకటించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
టీజేఎస్ విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/అశ్వారావుపేట రూరల్, మార్చి 2: ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీజేఎస్ తరపున బరిలో దిగిన ప్రొఫెసర్ కోదండరామ్కు తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీడీపీ శ్రేణులు కోదండరామ్ విజయం కోసం పనిచేయబోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుంచి టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పోటీలో ఉండగా అక్కడ ఆయనకు టీజేఎస్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానంలో టీజేఎస్ అభ్యర్థిగా ఉన్న కోదండరామ్కు టీడీపీ మద్దతు ఇస్తోందిని అశ్వారావుపేట ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మెచ్చా నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు కోదండరామ్కు న్యూడెమోక్రసీతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు టీడీపీ కూడా మద్దతు తెలపడంతో గ్రామ, మండలస్థాయిలో ఆయన విజయంకోసం టీడీపీ కేడర్ పనిచేయనుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి రాంమోహన్రావు బరిలో ఉండగా జిల్లాలో టీడీపీ శ్రేణులే ఆయనకు అండగా నిలిచి గణణీయమైన ఓటుబ్యాంకు సాధించాయి. ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీ ముఖ్యనేతలు చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో టీడీపీ బలహీనపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ టీడీపీ కూటమిగా బరిలో నిలిచి సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ గెలిచింది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్పుడు ఖమ్మం అభ్యర్థిగా నిలిచిన నామా నాగేశ్వరరావు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. దీంతో జిల్లాలో సీనియర్ నాయకులు కూడా టీఆర్ఎస్ వైపు వచ్చారు. ప్రస్తుతం టీడీపీలో ద్వితీయ, తృతీయశ్రేణి కేడర్తో పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీజేఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా టీడీపీ నేతలు అధికారికంగా కోదండరామ్ గెలుపుకోసం జిల్లాలో ప్రచారం నిర్వహించబోతున్నారు. రాష్ట్ర టీడీపీ నేతలు కూడా కోదండారమ్ తరుపున ప్రచారానికి రానున్నట్టు తెలిసింది.
తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కోదండరాం : మెచ్చా
తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం ప్రకటించారు. అశ్వారావుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పోటీలో లేనందున.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసి ప్రజలను ఉద్యమం వైపు నడిపిన నాయకుడు కోదండరామ్ అని కితాబిచ్చిన మెచ్చా.. ఆయన విజయం కోసం మిత్రపక్షాలతో కలిసి టీడీపీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజమోహనరెడ్డి, రాష్ట్ర నాయకులు కట్రం స్వామి, ఎంపీటీసీ మిండా హరి, నాయకులు ఈదర రాంబాబు, తదితరులున్నారు.