మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-04T02:59:18+05:30 IST
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర ఆయనను...
అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. విశాఖ వైపు వెళుతున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తుని నుంచి విజయవాడకు పోలీసులు తరలించారు. మంత్రి పేర్ని నానికి అత్యంత ఆప్తుడైన మోకా హత్యతో బందరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మోకా భాస్కరరావు మచిలీపట్నం 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన గత సోమవారం ఉదయం చేపల మార్కెట్కు వచ్చి, అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. అదే సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయనను ఆటోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.