పేదలకు భారమైన ఓటీఎస్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-03T06:35:51+05:30 IST
ప్రభుత్వం తక్షణం ఓటీఎ్సను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు.
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు డిమాండ్
గుడివాడటౌన్, డిసెంబరు 2 : ప్రతి పేదవానికి పక్కా గృహం ఉచితంగా నిర్మిస్తామని, టిడ్కో ఇళ్లకు రూ.3 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రజలను మాయచేసి గద్దెనెక్కిన సీఎం జగన్ పేదలపై ఓటీఎస్ పథకం రుద్దడం దారుణమని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వం తక్షణం ఓటీఎ్సను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు చెల్లించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, పేదలు ఎవ్వరూ సొమ్ము చెల్లించనవసరం లేదని రావి వెంకటేశ్వరరావు భరోసా ఇచ్చారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి చల్లగుళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, సర్పంచ్ కాకరాల సురేష్, దేవర పల్లి కోటి, యార్లగడ్డ సుధారాణి, సిరిపురపు తులసీరాణి, ముల్ళపూడి రమేష్, దాసు శ్యామ్, గుడివాడ జోషి తదితరులు పాల్గొన్నారు.