Atmakur By Election: ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా టీడీపీ.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-01T00:04:46+05:30 IST

ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. మేకపాటి కుటుంబ సభ్యులకే..

Atmakur By Election: ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా టీడీపీ.. కారణం ఏంటంటే..

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ టీడీపీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్న విషయంపై టీడీపీ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.


బీజేపీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. అయితే బీజేపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి ఈ ఉప ఎన్నికలో జనసేన మద్దతు తెలపనుంది. మేకపాటి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. అయితే.. మేకపాటి గౌతమ్ రెడ్డి భార్యకు టికెట్ ఇచ్చేందుకు జగన్ మొగ్గుచూపుతుండగా.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం తన చిన్న కొడుకు విక్రమ్ రెడ్డి‌కి టికెట్ ఇవ్వాలని జగన్ ముందు ఇప్పటికే ప్రతిపాదన పెట్టారు. వైసీపీ ముఖ్య నేతలందరితో చర్చించాక మేకపాటి ఈ ప్రతిపాదనను జగన్ ముందుకు తీసుకెళ్లారు.



వైసీపీ అధినేత జగన్ కూడా మేకపాటి విక్రమ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నప్పటికీ బీజేపీ పోటీలో ఉంటామని తేల్చేయడంతో ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదని స్పష్టమైంది. బీజేపీ పోటీకి నిలబెట్టే అభ్యర్థి ఎవరనే అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బద్వేలు ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనతల సురేష్‌కు 21,678 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలయిన ఓట్లలో బీజేపీకి 14.73 శాతం ఓట్లు దక్కాయి. 2019లో బీజేపీకి బద్వేలులో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయని, ఉప ఎన్నికలో 21,678కి పెరిగాయంటే బీజేపీ ఎదుగుదలకు ఇది సంకేతమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ కో-ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ ఆ సమయంలో చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-06-01T00:04:46+05:30 IST