ఐటీ పంచనామా రిపోర్ట్: వైసీపీ ఇప్పుడేమంటుందో.. టీడీపీ కౌంటర్
ABN , First Publish Date - 2020-02-16T18:57:02+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించిన ఐటీ పంచనామా
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించిన ఐటీ పంచనామా రిపోర్టుపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన ఆ పార్టీ.. వైసీపీకి చురకలంటించింది. చంద్రబాబుకు బురద పూసే పండుగలు చేసుకుందామనుకున్న వైసీపీకి ఆ సంతోషం లేకుండా పోయిందని విమర్శించింది. నీచమైన ప్రచారం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలని ప్రకటనలో పేర్కొంది.
ప్రకటన యథాతథంగా...
‘సీబీఐ వెంటపడుతుంటే పాపాల పుట్ట పగిలే కాలం దగ్గర పడిందని చూచాయగా అర్థమైందో ఏమో... ఏ-1, ఏ-2లు శుక్రవారం బురద పూసే పండుగలు భారీ ఎత్తున ప్లాన్ చేసుకుని జరుపుకుంటున్నారు. అలా చేసుకున్న పండుగే సాక్షి మీడియా ప్రచారం చేసిన 'రూ.2000 కోట్ల చంద్రబాబు అవినీతి' కథ. కానీ పాపం ఏ-1, ఏ-2ల పండుగ సంతోషం రెండు రోజులు కూడా లేకపోయింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల తాలూకా పంచనామా నివేదిక వచ్చింది. శ్రీనివాస్ ఇంట్లో దొరికింది కేవలం రూ.2,63,000లు అని, అది కూడా ఆయనకు తిరిగి ఇచ్చేసినట్టు ఉంది. ఇక ఆయన కూతురు పెళ్లి కోసం, వచ్చిన బంధువుల నగలు అన్నీ కలిపి, 12 తులాల బంగారం ఉన్నట్టు అది కూడా ఆయనకు తిరిగి ఇచ్చేసినట్టు ఉంది. పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి వైసీపీ దొంగలు... మీరు చేసిన నీచపు పనికి మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు?’ అని టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఇదిలా ఉంటే.. ఐటీ పంచనామా రిపోర్టు తొలుత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఐటీ సోదాలపై.. ఆ శాఖ ఇచ్చిన పంచనామా క్లారిటీ ఇచ్చింది. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.