వేధింపులతో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు: చినరాజప్ప
ABN , First Publish Date - 2020-07-12T21:30:27+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. దౌర్జన్యాలు పెరిగిపోయి రాష్ర్టంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్నారు. సామాన్య ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి 11 మందిని హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ర్టంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మహిళలు, చిన్నారులపై 210 అత్యాచారాలు జరిగాయన్నారు.