విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించడంపై మండిపడ్డ Chandrababu
ABN , First Publish Date - 2022-07-16T18:35:15+05:30 IST
విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
అమరావతి: విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara chandrababu naidu) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గత తెలుగుదేశం ప్రభుత్వంలో "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ‘‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు... ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థులు విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం... ఇప్పుడు "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించి జగన్(Jagan) తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే అని అన్నారు. ఇది జగన్ అహంకారమే అంబేద్కర్ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే అని తెలిపారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.