మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా... బస్సులు ఇవ్వనివ్వరా? మీ అబ్బ సొత్తా? : Chandrababu

ABN , First Publish Date - 2022-05-26T19:45:02+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా... బస్సులు ఇవ్వనివ్వరా? మీ అబ్బ సొత్తా? : Chandrababu

గుంటూరు: మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి జగన్(Jagan) పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ‘‘మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా... బస్సులు ఇవ్వనివ్వరా? మీ అబ్బ సొత్తా?’’ అంటూ విరుచుకుపడ్డారు. జగన్ ఒక చిల్లర సీఎం అని... అందరి తోకలు కట్ చేస్తామని అన్నారు. వైసీపీ ఆపితే మహానాడు ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రభంజనంలా మహానాడు జరగబోతుందని తెలిపారు. అన్ని గుర్తు పెట్టుకుంటున్నామని... చక్ర వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత హెచ్చరించారు.


రాష్ట్రంలో ఏ వర్గం బాలేదని... ఏ కులం బాలేదని...రైతులు బాలేరని అన్నారు. గడప గడపకు వైసీపీ కాస్తా ఇప్పుడు బస్సు యాత్ర అయ్యిందని... రేపు గాలిలో వస్తారా? అంటూ యెద్దేవా చేశారు. సామాజిక న్యాయం అంటున్న వైసీపీ నలుగురు రెడ్లకు రాజ్యసభ ఇచ్చిందన్నారు. 9 రాజ్యసభ సీట్లలో ఉత్తరంద్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీలకు ఇచ్చిన 20 కార్యక్రమాలు రద్దు చేశారని మండిపడ్డారు. బస్సు యాత్రకు వస్తున్న మంత్రులను ప్రజలు నిలదీయాలని బాబు పిలుపునిచ్చారు.


ఎమ్మెల్సీ అనంత బాబు స్వయంగా డ్రైవర్‌ను చంపి డెడ్ బాడీ‌ని ఇంటికి తెచ్చి పడేశారని... సుబ్రహ్మణ్యం భార్య ప్రలోభాలకు తలొగ్గ లేదన్నారు. టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లనే అనంత బాబు అరెస్ట్ అయ్యారన్నారు. కోనసీమలో ఘర్షణలు ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. రేపో, ఎల్లుండో మధ్యంతరం అని జగన్ అంటున్నారని,  ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలా ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన శని ముందే వదులుతుంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-26T19:45:02+05:30 IST