సోమవారం ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు
ABN , First Publish Date - 2020-05-24T04:04:12+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి అనగా సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు.
హైదరాబాద్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి అనగా సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు. సోమవారం నాడు హైదరాబాద్లోని తన ఇంటి నుంచి నేరుగా విశాఖకు చేరుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను బాబు పరామర్శించనున్నారు. సోమవారం 10:30 గంటలకు జిల్లాకు చెందిన నాయకులతో కలిసి బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా.. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయిన విషయం విదితమే.
హైదరాబాద్లో ఉన్నప్పటికీ...
పరామర్శ అనంతరం అదే విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ ప్రయాణానికి గాను అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఈ మేరకు లేఖ రాశారు. కాగా చంద్రబాబు ఏపీకి ఎందుకు రాలేదనే విషయం వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ జూమ్ యాప్ ద్వారా అటు ముఖ్య నేతలతో.. ఇటు పలువురు ముఖ్య కార్యకర్తలతో నిత్యం టచ్లో ఉంటూ వచ్చారు.
ఏపీ సర్కార్ అనుమతి ఇస్తుందా..!?
ఇదిలా ఉంటే.. వారాంతాల్లో హైదరాబాద్లోని తన నివాసానికి చంద్రబాబు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే మార్చి నెలలో హైదరాబాద్కు రాగా లాక్డౌన్తో నగరంలోనే నిలిచిపోయారు. ఆ తర్వాత మార్చి-20 నుంచి వరుసగా నాలుగు లాక్ డౌన్లతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్లో సడలింపులు ఉన్న నేపథ్యంలో ఏపీ వెళ్లేందుకు ఏపీ, తెలంగాణ డీజీపీలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే తెలంగాణ డీజీపీ అనుమతిచ్చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఇంకా అనుమతి రాలేదు. అసలు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..? లేదా..? అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.