3 రాజధానులంటే నవ్వుతున్నారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-02-19T22:51:01+05:30 IST
విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో
ప్రకాశం: విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మేదరమెట్లలో చంద్రబాబు మాట్లాడారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుకొట్టారని ధ్వజమెత్తారు. పేదవాళ్లు తిండి తినడం కూడా జగన్కు ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. జగన్.. మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు మూడు రాజధానులు అని చెప్తే నవ్వుతారని సెటైర్ వేశారు.
‘‘అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ప్రచారం చేశారు. ఎక్కడో నందిగామ, నూజివీడులో భూములు కొంటే.. అది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందంట. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి విశాఖపై ప్రేమ లేదు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని వెళ్లగొట్టారు. ప్రజలు 3 రాజధానుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఇష్టానుసారం సిమెంట్, పెట్రోల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. తప్పు చేస్తే ఎప్పటికైనా ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. కేసీఆర్తో కలిసి జగన్ ఏపీ ప్రజల చెవిలో పువ్వులు పెట్టాడు. పీఆర్సీ ఇవ్వలేదు.. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.