ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులను మాత్రమే: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-01-05T01:46:39+05:30 IST
ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 22 మున్సిపల్ కార్పొరేషన్లకు
అమరావతి: ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 22 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఇన్ఛార్జులు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించుతామన్నారు. ఇకపై సంప్రదాయ రాజకీయాలు నడవవన్నారు. ఎక్కడ నామినేషన్లు విఫలమైనా, ఓటమి పాలైనా ముఖ్య నేతలదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని విస్మరించి కొత్త వ్యక్తులను ప్రోత్సహించామన్నారు. ఇప్పుడు వారంతా వెళ్లి ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారని ఆయన మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారన్నారు. తమ అడుగులకు మడుగులొత్తే వారికి నామినేటెడ్ పదవులు వచ్చేలా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.
అయాచితంగా పదవులు పొందిన వారు అధికారం పోగానే ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారన్నారు. తాము పోటీ చేసే ఎన్నికలు కాదు కదా అని కొందరు నేతలు స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేసే నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికలను సీరియస్గా తీసుకున్న చోట్ల గట్టిపోటీ ఇచ్చామని, కొన్ని చోట్ల గెలిచామన్నారు. టీడీపీ ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేసుకోవడం వంటివి కూడా పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఓటరు లిస్టులను సరి చూసుకుని అవసరమైతే అప్పీలుకు వెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు.