క్వారంటైన్ కేంద్రాల్లో ఇంత ఘోరమా?
ABN , First Publish Date - 2020-07-14T08:25:48+05:30 IST
కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు వెల్లడిస్తున్న
- టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు వెల్లడిస్తున్న ఆవేదనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయా కేంద్రాల్లో ఎందుకింత అమానవీయ పరిస్థితులు నెలకొన్నాయని సోమవారం ట్విట్టర్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు క్వారంటైన్ కేంద్రంలోని బాధితులు గోడును వెళ్లబోసుకొన్న వీడియోను ట్విటర్ ఖాతాకు జతచేశారు. ‘‘క్వారంటైన్ కేంద్రాల్లోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో అభద్రత, ఆందోళన పెంచేలా ఉన్నాయి. ఇంతింత ఖర్చు పెడుతున్నామని లెక్కలు చెబుతున్నారు. అయినా ఎందుకింత దారుణంగా ఉంటున్నాయి? బాధితుల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? అక్షయ పాత్ర వంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్లను ఎంతో ఘనంగా నిర్వహించాం.
పనితనం మాటల్లో.. ప్రకటనల్లో కాదు.. చేతల్లో చూపించండి’’ అని ప్రభుత్వానికి హితవు పలికారు. చిత్తూరు జిల్లా టీడీపీ నేత సుబ్రమణ్య యాదవ్పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీపురం మండలం పూజగారిపల్లె మాజీ సర్పంచి సుబ్రమణ్య యాదవ్పై తప్పుడు కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సుబ్రమణ్యయాదవ్కు చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు.