రుయా ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ABN , First Publish Date - 2021-05-11T16:07:56+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

రుయా ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కరోనా బాధితులకు సాయంలోనూ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని  విమర్శించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. కరోనాతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అచ్చెన్న విమర్శించారు. బాధితులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం అత్యంత ఘోరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని... తాజాగా రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన ఘటనలోని వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రజల్ని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్, మాజీమంత్రి ఎన్.అమర్ నాథ్ రెడ్డి,  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మల్యే ఎం.సుగుణమ్మ, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  బత్యాల చెంగల్రాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి కమిటీలో సభ్యులుగా నియమించినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T16:07:56+05:30 IST