వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్య

ABN , First Publish Date - 2020-05-31T01:44:10+05:30 IST

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్య

తిరుపతి : చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు గ్రామంలో టీడీపీ కార్యకర్త గోపి (40)ని వైసీపీకి చెందిన గంగాధరం వర్గీయుల దాడి చేసి హతమార్చారు. ఇవాళ సాయంత్రం జరిగిన ఈ దాడిలో గోపి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన తమ్ముడు హరి, అల్లుడు పాండుకు గాయాలయ్యాయి. తొలుత గోపిని తమ కార్యకర్తగా ప్రచారం చేయించిన వైసీపీ నాయకులు ఆ తర్వాత ఆరా తీయగా మృతుడు టీడీపీ కార్యకర్తగా నిర్ధరాణ అయ్యింది. 


నేతల పరామర్శ

విషయం తెలుసుకున్న గోపి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబసభ్యులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, రాష్ర్ట కార్వనిర్వాహాక కార్యదర్శి, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి జేడి రాజశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు తగవన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. తొట్టంబేడులో టీడీపీ కార్యకర్త గోపిని వైసీపీ వర్గీయులు దారుణ హత్య చేయడం బాధాకరమన్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో గోపి కుటుంబసభ్యులను పరామర్శించి, గోపి మృతదేహానికి నివాళులర్పించామన్నారు. గోపి కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2020-05-31T01:44:10+05:30 IST