ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న టీబీజీకేఎస్, టీఆర్ఎస్
ABN , First Publish Date - 2022-08-11T05:32:04+05:30 IST
సింగరేణిలో ప్రైవేటీకరణను టీబీజీకేఎస్, టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు.
ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్
గోదావరిఖని, ఆగస్టు 10: సింగరేణిలో ప్రైవేటీకరణను టీబీజీకేఎస్, టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. బుధవారం ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, ప్రైవేటీకరణకు అనుకూలంగా టీఆర్ఎస్ ఢిల్లీలో సంతకాలు చేసిందని, ఇప్పుడు కార్మికులపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కంపెనీలో ఆనాడు లక్షా ఇరవై వేల మంది ఉంటే నేడు ఆ సంఖ్య 43వేలకు చేరుకుందన్నారు. అధికారుల సంఖ్య మాత్రం 2500మంది అలాగే ఉన్నారని, కార్మికులపై పనిభారం మోపుతూ కార్మికులను తొలగిస్తోందన్నారు. భూగర్భ గనుల్లో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తోందని, ఏఎల్పీ, శాంతిఖని గనుల్లో వందల కోట్లు పెట్టుబడి పెట్టినా ఆ గనులు నష్టాల్లో ఉన్నప్పటికీ వాటిని నడిపించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని మరిచిందని, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన అన్నారు. జీడీకే 11ఇంక్లైన్ పిట్ కార్యదర్శి గాదె సంపత్ను నియమించినట్టు జనక్ ప్రసాద్ ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి, లక్ష్మిపతిగౌడ్, దాస్, గడ్డం కృష్ణ, దేవులపల్లి రాజేందర్, సమ్మయ్య, అక్బర్ అలీ, కోట రవీందర్రెడ్డి, సదానందం, మార్కండేయ పాల్గొన్నారు.