తాటి ముంజల లభ్యత కరువు
ABN , First Publish Date - 2021-04-19T06:22:37+05:30 IST
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి ప్రసాదించే తాటి ముంజల కోసం జనం ఎదురు చూస్తుంటారు.
కనుమరుగవుతున్న తాటిచెట్లు
ప్రియంగా మారిన ముంజలు
పామూరు, ఏప్రిల్ 18: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి ప్రసాదించే తాటి ముంజల కోసం జనం ఎదురు చూస్తుంటారు. వేసవి కాలంలో దొరికి తినే తాటి ముంజల లభ్యత రాను రాను తగ్గిపోతోంది. దీంతో చౌకగా దొరకాల్సిన ముంజలు సైతం ప్రియం అవుతున్నాయి.
మండలంలోని బుక్కాపురం, దూబగుంట, రేణిమడుగు, కంభాల దిన్నె, అక్కంపేట గ్రామాల నుంచి కొంత మంది తాటి ముంజలను పామూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. పృకృతి ఉచితంగా అందించినవి తెచ్చి అమ్ముకోవడంలో తప్పు లేకపోయినా, ప్రజల జిహ్వ చాపల్యాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచన విక్రయదారుల్లో ఉండడం బాధాకరం. ప్రస్తుతం ముంజలకు అధిక ధరలు వెచ్చించాల్సి వస్తోందని తాటిముంజల ప్రియులు వాపోతున్నారు. పల్లెసీమలు ఒకప్పుడు పంట పొలాలు తాటిచెట్లతో కళకళలాడేవి. అంతే కాకుండా చెరువు, పొలం గట్లపైన, రోడ్లు పక్కన తాటిచెట్లు నిటారుగా ఠీవీగా నిలిచి ఉండేవి. ఇప్పుడు ఆ తాటిచెట్లు అదృశ్యమయ్యాయి. రియలెస్టెట్ పుణ్యాన ఉన్న చెట్లు నరుకుతుడడంతో క్రమేపి చెట్టు కనిపించకుండా పోయే పరిస్థితి వస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తాటి ముంజెలు అమ్మాలన్నా ప్రయాసే
పామూరు పరిసరాల ప్రాంతం నుంచి తాటి గెలల నుంచి తాటి కాయలు వలచి ముంజలను గంపల్లో వేసుకొని ఆటోల ద్వారా పామూరుకు తీసుకొస్తారు. ఇక్కడ మండే ఎండలో రోడ్ల వెంట కూర్చొని విక్రయిస్తున్నారు. ఇక ముంజలు తీయడంలోనూ నేర్పు అవసరం. వేసవిలో ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి లేక పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితిలో కొంత మంది ముంజల వ్యాపారం చేస్తున్నారు. రూ.10కి మూడు మంజలమ్మినా.., రోజు కూలీ కూడా రావటం లేదని మరోవైపు విక్రయ దారులు పెదవి విరుస్తున్నారు.