బిగ్ బాస్కెట్‌లో టాటా గ్రూప్... రూ. 7,350 కోట్ల డీల్

ABN , First Publish Date - 2020-10-28T19:56:29+05:30 IST

భారత ఆన్‌లైన్ గ్రాసరీ స్టార్టప్ ‘బిగ్‌బాస్కెట్‌’లో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్ల్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,350 కోట్లు)కు ఈ డీల్ కుదరవచ్చునని భావిస్తున్నారు.

బిగ్ బాస్కెట్‌లో టాటా గ్రూప్... రూ. 7,350 కోట్ల డీల్

ముంబై : భారత ఆన్‌లైన్ గ్రాసరీ స్టార్టప్ ‘బిగ్‌బాస్కెట్‌’లో  మెజారిటీ వాటాను టాటా గ్రూప్  కొనుగోలు చేయనున్నట్ల్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,350 కోట్లు)కు ఈ డీల్ కుదరవచ్చునని భావిస్తున్నారు. 


గ్రూప్‌లోని కన్స్యూమర్ బిజినెస్‌లన్నింటినీ కలుపుతూ  టాటా గ్రూప్ ఓ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు... దేశీయంగా అమెజాన్, రిలయన్స్ సంస్థలు ఈ-కామర్స్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే... టాటా గ్రూప్ కూడా ఈ-కామర్స్ దిశగా అడుగులు వేస్తోంది.


వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫ్రెష్ సేవలతో బెంగళూరుకు చెందిన బిగ్ బాస్కెట్ ఇప్పటివరకు  పోటీపడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే... ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మరి నేపధ్యంలో ‘ఆన్‌లైన్’ షాపింగ్‌కు అనూహ్యమైన ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే... సూపర్ యాప్ ద్వారా ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తోన్న టాటా గ్రూప్.. ఇందులో భాగంగానే బిగ్ బాస్కెట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. కాగా... అటు టాటా గ్రూప్ లేదా బిగ్ బాస్కెట్ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.


చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌‌నకు బిగ్ బాస్కెట్‌లో 26 శాతం వాటా ఉంది. తమ వాటా మొత్తాన్ని విక్రయించాలని అలీబాబా భావిస్తోందని కూడా వినవస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్కెట్‌లో భారీ వాటా కోసం టాటా గ్రూప్ 500-700 మిలియన్   డాలర్ల మేర చెల్లింపులు జరపవచ్చని 'సమాచారం. 


టాటాకు సగం వాటా..! 

బిగ్ బాస్కెట్‌లో దాదాపు సగం వాటాను బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్  చేజిక్కించుకోవచ్చని కూడా వినవస్తోంది. ఇక ఈ క్రమంలోనే...  బిగ్ బాస్కెట్ ఫండ్ రైజింగ్ కోసం ఇన్వెస్టర్లతో టాటా గ్రూప్ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. సింగపూర్‌కు చెందిన టెమ్‌సెక్, అమెరికా జనరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఫిడెలిటీ అండ్ టైబోర్న్ క్యాపిటల్ వంటి వాటితో 350 బిలియన్ల నుండి 400 బిలియన్ల కోసం చర్చలు జరిపింది. 

Updated Date - 2020-10-28T19:56:29+05:30 IST