70 ఏళ్ల బంధానికి ‘టాటా’
ABN , First Publish Date - 2020-09-23T05:54:10+05:30 IST
టాటా గ్రూపు-షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపుల పోరుకు త్వరలో ముగింపు స్లైడ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (
వాటా అమ్మితే కొంటాం: టీఎ్సపీఎల్.. మేమూ సిద్ధమే : మిస్ర్తీ కుటుంబం
న్యూఢిల్లీ : టాటా గ్రూపు-షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపుల పోరుకు త్వరలో ముగింపు స్లైడ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎ్సపీఎల్) ఈక్విటీలో ఎస్పీ గ్రూపునకు ఉన్న వాటా మొత్తాన్ని కొనేందుకు సిద్ధమని టాటా గ్రూపు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సముచితమైన, సరైన ధర చెల్లించేందుకు వారు సిద్దమైతే, టీఎ్సపీఎల్లో తమకు ఉన్న 18.37 శాతం వాటా ను విక్రయించేందుకు తామూ సిద్ధమేనని ఎస్పీ గ్రూపు ఒక ప్రకటన విడుదల చేసింది.
టాటా గ్రూపుతో ఇక వేగలేమనే అభిప్రాయంతోనే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. వాటా అమ్మకంపై రెండు సంస్థలు ఒక అంగీకారానికి వస్తే దాదాపుగా 70 ఏళ్ల నుంచి ఈ రెండు పార్శీ పారిశ్రామిక దిగ్గజ సంస్థల మధ్యకొనసాగుతున్న పారిశ్రామిక ‘అనుబంధానికి’ తెరపడినట్టే.
విలువ రూ.1.75 లక్షల కోట్లు?
టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టీఎ్సపీఎల్ ఈక్విటీలో ఎస్పీ గ్రూపునకు 18.37 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే దీని విలువ రూ.1.75 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో టాటా గ్రూపు ఎంత ధర చెల్లించేందుకు సిద్ధమవుతుందోనని ఆసక్తి వ్యక్తం అవుతోంది. టాటా గ్రూపు ఇప్పటికే పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉంది.
టెలికాం వ్యాపారంలో దాదాపు రూ.60,000 కోట్ల వరకు నష్టపోయింది. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీలూ పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. కోవిడ్ దెబ్బతో ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, టాటా రియల్టీ కంపెనీల పరిస్థితీ దిన దిన గండంగా మారింది. దీంతో మిస్త్రీలు అమ్మేందుకు సిద్ధమైనా రూ.1.75 లక్షల కోట్లు పెట్టి,వారి వాటా కొనేంత ఆర్థిక స్థోమత, ప్రస్తుత పరిస్థితుల్లో టాటా సన్స్కు లేదని మార్కెట్ వర్గాల అంచనా.
‘సుప్రీం’ స్టే:
అంతకు ముందు ఎస్పీ గ్రూపు, టీఎ్సపీఎల్ షేర్లను తాకట్టు పెట్టడంపై సుప్రీం కోర్టులో టాటాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ షేర్లను తాకట్టు లేదా ఇతరులకు బదిలీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వచ్చే నెల 28న తదుపరి విచారణ జరిగే వరకు ఈ స్టే కొనసాగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
దురుద్దేశంతోనే
నిధుల సమీకరణను అడ్డుకుని, ఆర్థికంగా దెబ్బతీసేందుకే టీఎ్సపీఎల్ షేర్ల తాకట్టును టాటా గ్రూపు అడ్డుకుంటోందని ఎస్పీ గ్రూపు తరఫున వాదించిన సీనియర్ లాయర్ సీఏ సుందరం కోర్టుకు తెలిపారు. ఇది జరిగిన కొద్ది సేపటికే సముచిత ధర చెల్లిస్తే టీఎ్సపీఎల్ ఈక్విటీలో తమకు ఉన్న వాటాను విక్రయించేందుకు సిద్ధమని ఎస్పీ రగ్రూపు ప్రకట విడుదల చేసింది. సైరస్ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఈ రెండు పారిశ్రామిక దిగ్గజ సంస్థల మధ్య పోరు నడుస్తోంది.