TANTEX: ఆసక్తికరంగా నెలనెలా తెలుగు వెన్నెల 177వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-04-15T17:30:07+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన 177వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

TANTEX: ఆసక్తికరంగా నెలనెలా తెలుగు వెన్నెల 177వ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 177వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన 177వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం జూంలో జరుగుతోంది. అయితే, ఈసారి జూంతో కలిసి అందరి మధ్యలో ఆహ్లాదంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో, సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. జూం ద్వారా గోవర్ధనరావు నిడిగంటి, రాధ కాశీనాధుని, శారద సింగిరెడ్డి, లక్ష్మి పాలేటి పాల్గొన్నారు. నెల్లూరులోని దొడ్ల కౌశల్యమ్మ మహిళా కళాశాల తెలుగు అధ్యాపకులు కోటేశ్వరరావు పుట్టమరాజు కూడా జూం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) పూర్వాధ్యక్షులు లక్ష్మి పాలేటి స్వయంగా చేసిన వడపప్పు, పానకం తీసుకువచ్చారు. అలాగే టాంటెక్స్ ఎగ్జిక్యూటివ్ కమీటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి భద్రాచలం నుండి సీతారాముల కళ్యాణం లడ్డుని సభకు విచ్చేసిన వారికి పంచిపెట్టారు.  


చిన్నారులు సింధు, సాహితీ శ్రీరామనవమి సందర్భంగా "రామ రారా సీతారామ రారా వేగ రారా మమ్ము బ్రోవరారా?” అంటూ చక్కగా ఆలపించారు. ప్రతి నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట, రాధ కాశీనాధుని కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల రాధ.. నంది తిమ్మన గారి పారిజాతాపహరణంలోని పద్యాలని చక్కగా పాడి వినిపించారు. కవి సమ్మేళనంలో భాగంగా లెనిన్ వేముల.. భాస్కర రామాయణం నుండి మనసును రంజింపజేసే కొన్ని కీర్తనలు రమ్యంగా పాడి అందరినీ అలరించారు. ఆధునిక సహజ పండితులు డా.నరసింహారెడ్డి ఊరుమిండి గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న "మన తెలుగు సిరిసంపదలు" కార్యక్రమంలో పొడుపుకథల మిళితమైన పద్యాలు, చమత్కార పదాలు ఉండే శ్లోకాలు, పదభ్రమకాలు సోదాహరణంగా వివరిస్తూ సభికులకి ప్రశ్నలు సంధించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పాలక మండలి సభ్యులు అనంత్ మల్లవరపు ప్రముఖ కవి గుజ్రాల్ ఉర్దూ కవిత్వాన్ని కవి సమ్మేళనం భాగంగా చదివి వినిపించారు. 2010 నుండి జరుగుతున్న మాసానికో మహనీయుడు శీర్షిక కింద అరుణ జ్యోతి ఏప్రిల్ నెలలో గుర్తు చేసుకోదగిన కవులు, రచయితలను ఉద్దేశించి ఆనాటి సంఘ దురాచారాలను ఎత్తి చూపిన కవి కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రం నవల గురించి సవివరంగా వివరించారు. సాజీ గోపాల్ యుద్ధం గురించి ప్రముఖ కవి వరవరరావు గారి కవితలను సభకు చదివి వినిపించారు.


టాంటెక్స్ 177వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డా.బీరం సుందరరావు "మానవత్వం పరిమళించే తెలుగు కవిత్వం" అంశం మీద ప్రసంగిస్తూ మానవ సేవయే మాధవ సేవయని చాటి చెప్పిన కవులు, వారు వ్రాసిన కొన్ని ముఖ్యమైన పద్యాలు, కవితలు చదివి వినిపించారు. మనకు తారసపడే ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉన్నాడని భావించి వారికి అవసర సమయంలో తోడ్పడి తృప్తితో జీవించగలిగితే అదే స్వర్గమని చెప్పారు. అలాగే మనం మన చుట్టూ ఉన్నవారిపై ప్రేమ, దయ చూపించి మానవత్వాన్ని పరమళింప చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తన ఉపన్యాసంలో ప్రస్ఫుటించారు. ముఖ్య అతిథిని టాంటెక్స్ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన సాహితీ, సింధూతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.టాంటెక్స్ ఎగ్జిక్యూటివ్ కమీటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉదయ్ నిడిగింటి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ బండారు, పాలక మండలి నుండి వెంకట్ ములుకుట్ల, అనంత్ మల్లవరపు, డా. భాస్కర్ రెడ్డి విచ్చేసి సభను జయప్రదం చేశారు.

Updated Date - 2022-04-15T17:30:07+05:30 IST