కారును ఢీకొన్న ట్యాంకర్‌ ... ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-08-10T05:28:24+05:30 IST

కారును ట్యాంకర్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కారును ఢీకొన్న ట్యాంకర్‌ ... ఇద్దరి మృతి
భీమగానిపల్లె వద్ద ఢీకొన్న వాహనాలు

పుంగనూరు రూరల్‌, ఆగస్టు 9: కారును ట్యాంకర్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పుంగనూరు పట్టణానికి చెందిన విశ్వనాథ రెడ్డి(52), అక్కుల్‌రెడ్డి(68), హైస్కూల్‌వీధికి చెందిన మునిస్వామిరెడ్డి(67), మండలంలోని కుమ్మరనత్తం పంచాయతీ బాలగురవయ్యగారిపల్లెకు చెందిన భూపాల్‌రాజు(50) కారులో సొంత పనుల నిమిత్తం మదనపల్లెకు వెళ్లారు.  తిరుగు ప్రయాణంలో పలమనేరు నుంచి మదనపల్లెకు వెళుతున్న ట్యాంకర్‌  పుంగనూరు బైపాస్‌ రోడ్డు భీమగానిపల్లె వద్ద కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భూపాల్‌రాజు అక్కడక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విశ్వనాథరెడ్డి, మునిస్వామిరెడ్డిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కుల్‌రెడ్డిని ప్రైవేటు వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మునిస్వామిరెడ్డి మృతి చెందాడు. న్యాయవాది విశ్వనాథరెడ్డిని మెరుగైన వైద్యం నిమిత్తం మదనపల్లెకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరా తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





Updated Date - 2022-08-10T05:28:24+05:30 IST