వెదుళ్లపల్లిలో చెరువు వివాదం
ABN , First Publish Date - 2021-06-23T05:26:51+05:30 IST
మండలంలోని వెదుళ్లపల్లి పంచాయతీ రాజంపేట చెరువు వివాదం మళ్లీ మొదలైంది.
సీతానగరం, జూన్ 22: మండలంలోని వెదుళ్లపల్లి పంచాయతీ రాజంపేట చెరువు వివాదం మళ్లీ మొదలైంది. రాజంపేట చెరువు వివాదం 2015 నుంచి రాజంపేట, వెదుళ్లపల్లి ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధీనంలో ఉండేది. రాజంపేట రామాలయానికి చెందిన చెరువు అని వారిని ఖాళీ చేయించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ చెరువు వద్ద 144 సెక్షన్ అమలు జరుగుతోంది. వారం క్రితం ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ ఎన్.సీతాపవన్కుమార్ చెరువు వివాదంపై ఇరువర్గాలతో చర్చలు జరపడానికి ముందుకు రావడంతో వివాదం తిరిగి ప్రారంభమైంది. రాజంపేటకు చెందిన కొందరు మంగళవారం ఉదయం చెరువులోని చేపలను పట్టి జోరుగా అమ్మకాలు జరిపారు. ఫిషర్మెన్ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎస్ఐ సుధాకర్, తహశీల్దార్ పవన్కుమార్ చెరువు వద్దకు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఫిషర్మెన్ సొసైటీలో ఉన్న రాజంపేటకు చెందిన వారికే చెరువు ఇస్తామని రాజంపేటకు చెందిన వారు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఆలోచించి చెబుతామని వారు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.