‘తానా’ ఎన్నికల ప్రచారం.. సిలికాన్ వ్యాలీలో సందడి.. 28 వంటకాలతో బాహుబలి విందు

ABN , First Publish Date - 2021-04-19T03:44:42+05:30 IST

ఈసారి జరగనున్న ‘తానా’ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రతిష్మాత్మక ‘తానా’ సంస్థలో పలు కీలకమైన పదవుల కోసం ఈ ఎన్నికలు..

‘తానా’ ఎన్నికల ప్రచారం.. సిలికాన్ వ్యాలీలో సందడి.. 28 వంటకాలతో బాహుబలి విందు

వాషింగ్టన్: ఈ సారి జరగనున్న ‘తానా’ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిష్మాత్మక ‘తానా’ సంస్థలో పలు కీలకమైన పదవుల కోసం జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులంతా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమెరికాలోని తెలుగువారితో మమేకమై తమను గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ‘తానా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ కొడాలి నరేన్ బృందం శనివారం బే ఏరియాలో పర్యటించింది. అక్కడ ఉన్న తెలుగు వారందరితో మమేకమయ్యేందుకు ‘మీట్ అండ్ గ్రీట్ డాక్టర్ నరేన్ కొడాలి టీం పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది.


‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ కాకర్ల సుబ్బారావుగారికి ఘన నివాళులు అర్పించి ఆత్మీయ సమ్మేళాన్ని ప్రారంభించారు. ‘తానా’కు కాకర్ల సుబ్బారావు చేసిన అనిర్వచనీయమైన సేవలను సమ్మేళనానికి హాజరైన వారు గుర్తు చేసుకున్నారు. కాకర్ల సుబ్బారావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు సంతాపం ప్రకటించారు. సుబ్బారావు అడుగుజాడల్లో నడిచి ‘తానా’ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు అందరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలకు నిలయమైన సిలికాన్ వ్యాలీలో కంప్యూటర్ సైన్స్‌లో  ఆచార్యుడైన డాక్టర్ నరేన్ కొడాలి చేసిన ప్రసంగం, తమ ప్యానెల్‌నే ఎందుకు గెలిపించాలో వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 


జగదీష్ ప్రభల(కోశాధికారి అభ్యర్థి), సునీల్ పాంత్రా (సంయుక్త కోశాధికారి అభ్యర్థి), రాజా సూరపనేని( ఫౌండేషన్ ట్రస్టీ  అభ్యర్థి), స్థానిక అభ్యర్థులు వెంకట్ కోగంటి (సంయుక్త కార్యదర్శి), రజనీకాంత్ కాకర్ల (కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్) ప్రసంగిస్తూ తాము గతంలో ‘తానా’ లో వివిధ హోదాలలో చేసిన పనులను గుర్తుచేశారు. తాము చేయబోయే ప్రణాళికను వివరించి తమను గెలిపించాలని అభ్యర్ధించారు.


 ‘తానా’ మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి తాను ఈ ప్యానెల్‌ను ఎందుకు సమర్థిస్తున్నదీ వివరించారు. రాజకీయ కారణాలతో కార్యదర్శి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని త్రుటిలో పోగొట్టుకొన్న భక్త బల్ల ఈ ప్యానెల్‌నే గెలిపించమని అభ్యర్ధించారు. 44 ఏళ్ల ‘తానా’ చరిత్రలో ‘తానా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉగాది పచ్చడితో పాటు నోరూరే 28 రకాల వంటకాల మెనూ తో ఏర్పాటు చేసిన ‘బాహుబలి/’అఖండ‘ విందు అందరిని ఆకొట్టుకుంది. ఈ ‘బాహుబలి/’అఖండ’ విందు భోజనాన్ని బావర్చి, స్వాగత్ రెస్టారెంట్లు ఏర్పాటు చేశాయి. బావర్చి ‘శ్రీకాంత్ దొడ్డపనేని’ ఆధ్వర్యంలో విందు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 


కరోనా విపత్తు తర్వాత భారీ సంఖ్యలో తెలుగు వారంతా హాజరైన తొలి సభ ఇదే. కార్యక్రమంలో ‘అఖండ’ గా రాబోతోన్న నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఈ నెవర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్ విందును ఆహూతులంతా ఆస్వాదించారు. చాలాకాలం తర్వాత ఎన్నో రకాల తెలుగు వంటకాలతో అచ్చ తెలుగు భోజనం ఆరగించామని ప్రశంసించారు. ‘బాటా’ సలహాదారు ‘శ్రీమతి విజయ ఆసూరి’ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. బాటా కార్యవర్గం నుంచి ప్రసాద్ మంగిన, కళ్యాణ్ కట్టమూరి, డాక్టర్ రమేష్ కొండా, ఆశా జ్యోతి, శంకర ఐ ఫౌండేషన్ ప్రతినిధులు వచ్చి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


ప్రముఖ గాయకుడు త్రినాథ రావు తెలుగు సంస్కృతి, ఉగాది మీద చక్కటి పాటను ఆలపించారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన కృష్ణ గొంప, లియోన్ బోయపాటి, గోకుల్ రాచిరాజు, భారత్ ముప్పిరాల, శ్రీకర్‌రెడ్డి, సుధీర్ ఉన్నం, చంద్ర గుంటుపల్లి, వీరబాబు పత్తిపాటి, విజయ్ గుమ్మడి, లక్ష్మణ్ పరుచూరి, సతీష్ బోళ్ల, సత్య తిపిర్నేని, ప్రకాష్ మద్దిపాటి, సందీప్ ఇంటూరి(స్వాగత్), మురళి గొడవర్తి, హర్ష యడ్లపాటి తదితరులకు, ఆహ్వానాన్ని మన్నించి సమ్మేళనానికి విచ్చేసిన తెలుగువారందరికీ డాక్టర్ నరేన్ కొడాలి టీం, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, రామ్ తోట ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-04-19T03:44:42+05:30 IST