తానా ఆధ్వర్యంలో ‘సాగువీరుడా.. సాహిత్యాభివందనం’ కార్యక్రమం!

ABN , First Publish Date - 2021-01-18T18:32:52+05:30 IST

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా! – సాహిత్యాభివందనం” అనే ప్రత్యేక కార్యక్రమం అంతర్జాలంలో అత్యంత విజయవంతంగా జరిగింది. తానా అ

తానా ఆధ్వర్యంలో ‘సాగువీరుడా.. సాహిత్యాభివందనం’ కార్యక్రమం!

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా! – సాహిత్యాభివందనం” అనే ప్రత్యేక కార్యక్రమం అంతర్జాలంలో అత్యంత విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన స్వాగతోపన్యాసంలో రైతుగా తన అనుభవాలను, తానా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను పంచుకుంటూ రైతు పాత్ర, ప్రాముఖ్యం అతివిలువైనది అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను, సమాజంలో అన్నదాతలు పోషిస్తున్న అద్వీతీయమైన పాత్రను కవిత్వం రూపంలో పంచుకున్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవాళి మొత్తం జీవించడానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న రైతును అనునిత్యం స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతు ప్రత్యక్ష దైవంగా అభివర్ణించారు. గ్రామీణ జీవితాలను, రైతుల యొక్క కృషిని పాఠ్యాంశాలలో చేర్చి.. యువతను మేలుకోల్పవలసిన అవసరాన్ని గుర్తు చేశారు. మరుగునపడిపోయిన.. ఎలాపట, దాపట, చ్చో చ్చో, హహయి, తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత వంటి పదాలను ఆసక్తికరంగా వివరించారు.“రైతు కోసం తానా” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అవసరమైన పరికరాలను అందించడంలో తానా చేస్తన్న కృషిని, తానా రైతు విభాగపు సమన్వయకర్త డా. కోట జానయ్య గారు వివరించారు.



బి.టెక్ రవిగా, హైబ్రిడ్ సీడ్స్ రవిగా అందరికి సుపరిచుతులైన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు తన రెండు వందెల ఎకరాల సేద్యంలో రెండు వందల కోట్ల రూపాయిల వ్యాపారాన్ని, పది మంది పి.హెచ్.డి విద్యావేత్తలకు, ఐదు వందల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని కొన్ని వేల రకాల కూరగాయల విత్తనాలను సృష్టిస్తున్న తీరును, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని తాను చేస్తున్న పరిశోధనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పిన కళ్ళెం ఉపేందర్ రెడ్డి అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ రైతు రాజ్యం అనే లాభాపేక్షరహిత సంస్థ ద్వారా ఖమ్మంలో రైతు కుటుంబాల, రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మున్డ్లురు తన సాధకబాధలను సంక్షిప్తంగా వివరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు తాను చేస్తున్న నూట డెబ్బైఐదు ఎకరాల వ్యవసాయాన్ని.. అందులో అవలంబిస్తున్న పద్ధతులను వివరంగా తెలియజేశారు. తెలంగాణా రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసాదరావుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి, హైదరాబాద్‌కు ఆహ్వానించి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను తెలియజేయాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. 


ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గీతరచయితలు, గాయకులు.. వందేమాతరం  శ్రీనివాస్, మారెన్న(అనంతపురం), మానుకోట ప్రసాద్(హైదరాబాద్), నూజిళ్ళ శ్రీనివాస్(రాజమండ్రి), కృష్ణవేణి(తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం(చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు(హైదరాబాద్), నగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్)లు పాల్గొని రైతు నేపథ్యసాహిత్యంతో కూడిన అనేక అద్భుత గీతాలను మధురంగా పాడి ఈ కార్యక్రమానికి నూతన శోభ తీసుకొచ్చారు. చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక సహకారం అందించిన వారికి, విశిష్ట అతిథులకు, గాయనీ గాయకులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Updated Date - 2021-01-18T18:32:52+05:30 IST