AP News: అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతులు
ABN , First Publish Date - 2022-09-27T18:17:46+05:30 IST
ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Tammineni Seetharam) దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ (Vijayawada): ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Tammineni Seetharam) దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఈవో డి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తమ్మినేని సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారన్నారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళ్తున్నారన్నారు.
ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని తమ్మినేని అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు సీఎం జగన్ శ్రమిస్తున్నారని, ఆయనకు శక్తిని ప్రసాదించి...అండగా నిలవాలని అమ్మను ప్రార్ధించానన్నారు. రాష్ట్రం ప్రజలను, ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని వేడుకున్నానన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి... పాడి పంటలు బాగా వృద్ధి చెందేలా అమ్మ కృపాకటాక్షాలుండాలని ఆకాంక్షిస్తున్నానని తమ్మినేని పేర్కొన్నారు.