Tamilnadu తెలుగువారి సమస్యలు తీర్చండి

ABN , First Publish Date - 2022-05-25T15:42:21+05:30 IST

తమిళనాట తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యలను తీర్చాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు తమిళనాడు తెలుగు యువశక్తి

Tamilnadu తెలుగువారి సమస్యలు తీర్చండి

                 - జగన్‌, కేసీఆర్‌లకు కేతిరెడ్డి లేఖ


చెన్నై: తమిళనాట తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యలను తీర్చాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వారిద్దరికీ మంగళవారం లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ తరువాత అత్యధికంగా తెలుగువారున్న రాష్ట్రం తమిళనాడేనని, ఇక్కడ సుమారు 2 కోట్ల మంది తెలుగువారు నివశిస్తున్నారని గుర్తు చేశారు. 1956 విభజన చట్టంలోని భాషాపరమైన అంశాలు తమిళనాట సరిగా అమలు కావడం లేదన్నారు. అందువల్ల ఇక్కడున్న మైనారిటీల హక్కులకు భంగం కలుగకుండా తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. తమిళనాట తెలుగువారు అధికంగా వున్న ప్రాంతాల్లో తెలుగు రెండో భాషగా అమలు చేయడంతో పాటు తెలుగువారు అధికంగా నివశించే ప్రాంతాల్లోని ఆలయాల్లో తెలుగువారిని ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా నియమించేలా కృషి చేయాలన్నారు. తెలుగు ప్రాంతాల్లో తెలుగు తెలిసిన అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాట రెండు తెలుగు రాష్ట్రాల నేతలు తెలుగు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి తెలుగును సులభంగా నేర్చుకునేందుకు పాఠ్యపుస్తకాలు రూపొందించి, ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 40 శాతానికి పైగా తెలుగువారున్నప్పటికీ వారి వివరాలను చూపడంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని, తెలుగువారి సంఖ్యను నిర్ధారించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. తమిళనాట తమిళం చదువుకునేంటేనే ఉద్యోగం అన్న చట్టం వున్నందున.. తెలుగు చదువుకున్న ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమిళనాట తెలుగు పాఠశాలల్ని పునరుద్ధరింపజేయాలన్నారు. ‘నిర్బంధ తమిళం’ చట్టం పరిధి నుంచి తెలుగును తొలగించి, తెలుగువారు తమకిష్టమైన భాష చదువుకునేలా వెసులుబాటు కల్పించాలని, ఆ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-25T15:42:21+05:30 IST