Tamil Nadu : మద్రాస్ హైకోర్టుకు ఐపీఎస్ అధికారుల ప్రమాణం

ABN , First Publish Date - 2022-08-24T22:55:27+05:30 IST

శిక్షణ పొందిన పోలీసు సిబ్బందిని తమ నివాసాల్లో పనుల కోసం ఉపయోగించుకోబోమని

Tamil Nadu : మద్రాస్ హైకోర్టుకు ఐపీఎస్ అధికారుల ప్రమాణం

చెన్నై : శిక్షణ పొందిన పోలీసు సిబ్బందిని తమ నివాసాల్లో పనుల కోసం ఉపయోగించుకోబోమని తమిళనాడులోని ఐపీఎస్ అధికారులు మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు ప్రమాణపూర్వకంగా చెప్పారు. ఈ మేరకు తమిళనాడు డీజీపీ (Director General of Police) సీ శైలేంద్ర బాబు (C Sylendra Babu) మంగళవారం అఫిడవిట్ దాఖలు చేశారు. 


1979 సెప్టెంబరు 5న ఆర్డర్లీ సిస్టమ్‌ను రద్దు చేసినట్లు తనకు తెలుసునని శైలేంద్ర ఈ అఫిడవిట్‌లో తెలిపారు. తన నివాసం వద్ద భద్రత, వైర్‌లెస్ ఆపరేషన్స్ వంటి అధికారిక విధుల నిర్వహణ కోసం నియమితులైన పోలీసు సిబ్బందిని ఇతర పనుల కోసం వినియోగించబోనని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఇదే నమూనాలో లిఖితపూర్వకంగా ప్రమాణ పత్రాలను తీసుకున్నట్లు చెప్పారు. పోలీసు సిబ్బంది చేత ఇంటి పనులు చేయించరాదని కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంతో పోలీసు శాఖ సంపూర్ణంగా ఏకీభవిస్తోందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 


ఈ అఫిడవిట్‌ను స్వీకరించిన జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆర్డర్లీ ప్రాక్టీస్‌ను నాలుగు నెలల్లో పూర్తిగా నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను జారీ చేశారు. తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో తనకు కేటాయించిన అధికారిక నివాసంలో గడువు మీరిన తర్వాత నివాసముండటంపై తమిళనాడు హౌసింగ్ బోర్డు తీసుకున్న చర్యలను ఆయన సవాల్ చేశారు. 


పోలీసు క్వార్టర్లు అనధికారిక ఆక్రమణలకు గురయ్యాయేమో తెలుసుకునేందుకు దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణదారులను చట్టప్రకారం ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. 


Updated Date - 2022-08-24T22:55:27+05:30 IST