Tamil Nadu Court : ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-08-06T17:51:09+05:30 IST
తమిళనాడులోని శివగంగై జిల్లాలో 2018లో జరిగిన ముగ్గురు
చెన్నై : తమిళనాడులోని శివగంగై జిల్లాలో 2018లో జరిగిన ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులపై అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టు శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. వీరు దోషులని ఆగస్టు 1న నిర్థరించింది. వీరికి శిక్షను శుక్రవారం ఖరారు చేసింది.
కోర్టు తీర్పు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జడ్జి జీ ముత్తు కుమారన్ ఈ కేసుపై విచారణ జరిపి, తీర్పునిచ్చారు.
తమిళనాడులోని శివగంగై జిల్లా, కచనంథమ్ గ్రామంలో 2018 మే 28న ఓ దేవాలయం వద్ద పూజలు చేసే విషయంలో వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య రాత్రి సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు దళితులు హత్యకు గురయ్యారు. అర్ముగం (65), షణ్ముగనాథన్ (31), చంద్రశేఖర్ (34)లను హత్య చేశారు. వీరంతా దళితులు. ఈ ఘర్షణ సమయంలో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనలో గాయపడిన తనశేఖర్ (32) ఓ ఏడాదిన్నర తర్వాత మరణించారు.
పోలీసులు 33 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. వీరిలో నలుగురు మైనర్లు, కాగా ఇద్దరు విచారణ సమయంలో మరణించారు, ఒకరు పరారయ్యారు. నిందితుల్లో కొందరు 2019లో బెయిలు కోసం దరఖాస్తు చేశారు. దీనిని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తోసిపుచ్చింది. శివగంగై జిల్లాలో కుల అసమానతల వికృత రూపానికి ఇది నిదర్శనమని పేర్కొంది.