ఆరోతరగతి విద్యార్థినికి CM ఫోన్‌కాల్...ఎందుకు చేశారంటే...

ABN , First Publish Date - 2021-10-16T16:47:34+05:30 IST

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న ప్రజ్ఞా అనే విద్యార్థినికి ఫోన్ కాల్ చేసిన ఘటన...

ఆరోతరగతి విద్యార్థినికి CM ఫోన్‌కాల్...ఎందుకు చేశారంటే...

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న ప్రజ్ఞా అనే విద్యార్థినికి ఫోన్ కాల్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్‌షిప్‌కు చెందిన ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రజ్ఞా ముఖ్యమంత్రి స్టాలిన్ కు లేఖ రాసింది. తాను పాఠశాల ఎప్పుడు పునర్ ప్రారంభం అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నానని సీఎంకు రాసిన లేఖలో కోరింది. సీఎంకు పాఠశాల బాలిక రాసిన లేఖలో తన ఫోన్ నంబరు కూడా ఇచ్చింది. బాలిక లేఖ చదివిన సీఎం స్టాలిన్ వెంటనే స్పందించి సదరు ప్రజ్ఞాకు ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 1వతేదీ నుంచి పాఠశాలలను తెరవబోతున్నట్లు సీఎం బాలికకు హామీ ఇచ్చారు.


 ‘‘నీవు చింతించవద్దు, కొవిడ్ భద్రతా ప్రోటోకాల్ ల ప్రకారం మీ టీచరు చేసే సూచనలు పాటిస్తూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలకు రావాలి’’ అని సీఎం సూచించారు.తన పాఠశాల ఎప్పుడు తెరుస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని, అందుకే తాను సీఎంకు లేఖ రాశానని ప్రజ్ఞా చెప్పింది. నా లేఖ చూసిన సీఎం స్టాలిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి మాట్లాడటం నమ్మలేక పోయానని ప్రజ్ఞా చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ఏడాదిన్నర కాలంగా మూసివేసిన పాఠశాలలను నవంబరు 1వతేదీన పునర్ ప్రారంభిస్తామని సీఎం స్టాలిన్ బాలిక ప్రజ్ఞాకు ఫోన్ లో తెలిపారు. 


Updated Date - 2021-10-16T16:47:34+05:30 IST