ఠారెత్తిస్తున్న టమాటా!
ABN , First Publish Date - 2021-11-24T09:23:59+05:30 IST
పెరిగిపోతున్న పెట్రోలు ధరల్లాగే మార్కెట్లో టమాటా రేటు కూడా మండిపోతోంది. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 అమ్మే టమాటాల ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది.
- హైదరాబాద్లో వందకు చేరువలో ధర..
- మదనపల్లెలో కిలో 130.. చెన్నైలో 160
- ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంట
- దిగుబడి తగ్గడంతో ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ, మదనపల్లె టౌన్, నవంబరు 23: పెరిగిపోతున్న పెట్రోలు ధరల్లాగే మార్కెట్లో టమాటా రేటు కూడా మండిపోతోంది. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 అమ్మే టమాటాల ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది. హైదరాబాద్లో కిలో టమాటా సెంచరీకి చేరవవుతోంది. సూపర్ మార్కెట్లలో దీని ధర రూ.90 వరకు ఉండగా, ఆన్లైన్ స్టోర్లలో రూ.80 వరకు ఉంది. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర రూ.వంద దాటేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో అయితే కేజీ రూ.150 దిశగా పరుగులు పెడుతోంది. మంగళవారం ఇక్కడ రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.130 పలికింది. చెన్నైలో ఈ నెల ఆరంభంలో కేజీ రూ.40 ఉన్న టమాటా ఇప్పుడు ఏకం గా రూ.160కి ఎగబాకింది. క్యాప్సికం, ఉల్లిపాయలతోపా టు ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. నెల్లూరు, విజయవాడతో పాటు తమిళనాడుకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కలకడ, పలమనేరు ప్రాంతాల నుంచి, కర్ణాటకలోని కోలారు నుంచి టమాటాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. అల్పపీడన ప్రభావం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలపై అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు సాగు చేసిన టమాటా పంట తుడిచిపెట్టుకుపోయింది. అంతంత మాత్రంగా మదనపల్లె మార్కెట్కు వస్తున్న టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇక్కడ కిలో రూ.130 ధర పలికింది. టమాటా అధికంగా పండించే ప్రాంతాలు వర్ష ప్రభావానికి గురికావడం, దీనికితోడు డీజిల్ రేట్లు కూడా పెరిగిపోవడం ధరలు పెరగడానికి కారణమైంది.
ఛత్తీస్గఢ్ టమాటానే దిక్కు!
మదనపల్లె ప్రాంతంలో దిగుబడి మరింత తగ్గుముఖం పడుతుండడంతో ఇక్కడి ప్రజ ల అవసరాలకు అనుగుణంగా ఛత్తీ్సగఢ్ టమాటానే దిక్కుగా మారనుంది. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్బుల్లాపూర్ నుంచి వచ్చే సరుకుపైనా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితిని విశ్లేషిస్తే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేసి ఛత్తీ్సగఢ్లోని రాయపూర్ నుంచి టమాటా దిగుమతి చేయించి, రైతు బజార్లలో విక్రయించాలని భావిస్తోంది. ప్రస్తుతం రాయపూర్ మార్కెట్ నుంచి పలమనేరు మార్కెట్కు కిలో రూ.70 చొప్పున విక్రయానికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కలుగజేసుకుని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రైతు బజార్లకు ఛత్తీ్సగఢ్ టమాటా దిగుమతి చేయించి అందుబాటు ధరలకు విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు.
టమాటా మేమే అమ్ముతాం: తమిళనాడు
చెన్నై: తమిళనాట కిలో టమాటా రూ.160కి పైగా విక్రయిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఈ ధరకు కళ్లెం వేసేందుకు తమిళనాడు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫామ్ గ్రీన్’ కూరగాయల దుకాణాల్లో టమాటాలు విక్రయించాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో బుధవారం నుంచి కేజీ టమాటా రూ.85-100కు విక్రయించనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యానవన శాఖ నుంచి ప్రతిరోజూ 15 మెట్రిక్ టన్నుల టమాటాలు సేకరించి ఫామ్ గ్రీన్ దుకాణాల్లో విక్రయించనున్నట్టు ప్రకటించింది.
రెండు బిర్యానీలు కొంటే అరకేజీ టమాటా ఫ్రీ
ఓ పక్క టమాటా ధరలు మండిపోతుంటే.. తమిళనాడులోని ఓ బిర్యానీ దుకాణం దీన్నే తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుంటోంది. తమ హోటల్లో రెండు బిర్యానీలు కొనేవారికి అర కిలో టమాటాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. చెంగల్పట్టు జిల్లా సొత్తుపాక్కంలోని బి ర్యానీ దుకాణం నిర్వాహకులు ఈ ఆఫర్ ఇచ్చారు. దీంతో జనం ఆ హోటల్ ఎదుట బారులుతీరారు. దీనిపై దుకాణం నిర్వాహకులు మాట్లాడుతూ... టమాటా ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ ఆఫర్ ప్రకటించామని చెప్పారు.