Nupur Sharma Row : భారత్కు తాలిబన్ల సుద్దులు
ABN , First Publish Date - 2022-06-08T01:40:41+05:30 IST
మత ఛాందసవాదం గురించి తాలిబన్లు భారత దేశానికి సుద్దులు చెప్తున్నారు
న్యూఢిల్లీ : మత ఛాందసవాదం గురించి తాలిబన్లు భారత దేశానికి సుద్దులు చెప్తున్నారు. బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇస్లామిక్ దేశాల సరసన ఆఫ్ఘనిస్థాన్ కూడా చేరింది. అలాంటి మత ఛాందసవాదులను భారత ప్రభుత్వం అనుమతించరాదని హితవు చెప్తోంది.
తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, పవిత్ర మతం ఇస్లాంను అవమానించడానికి, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి మత ఛాందసవాదులను అనుమతించవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు. భారత దేశంలో అధికార పార్టీకి చెందిన ప్రతినిధి ఇస్లాం ప్రవక్తకు వ్యతిరేకంగా అవమానకరమైన మాటలను ఉపయోగించడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన దేశాల్లో ఇరాన్, ఇరాక్, కువైట్, కతార్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా ఉన్నాయి.