Taliban: మమ్మల్ని గుర్తిస్తే మీకు ఇబ్బందులుండవ్
ABN , First Publish Date - 2021-10-31T21:26:45+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తాజాగా అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు. ఆఫ్ఘన్ నుంచి ముప్పు రాకూడదనుకుంటే తమను గుర్తించాలని డిమాండ్ చేసింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ డిమాండ్ చేశారు.
జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, తమను బాధ్యతాయుతమైన పక్షంగా తప్పనిసరిగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు. తమను గుర్తించే వరకు ముప్పును నివారించేందుకు తాము ఎటువంటి బాధ్యత తీసుకోబోమన్నారు. తమకు గుర్తింపు ఇవ్వడం ద్వైపాక్షిక అవసరమని తెలిపారు.
తాము అమెరికాతో పోరాడటానికి కారణం ఆ దేశం గతంలో తమకు గుర్తింపునివ్వకపోవడమేనని చెప్పారు. తాలిబన్లకు గుర్తింపునివ్వకపోతే, ఆఫ్ఘనిస్థాన్, ఈ ప్రాంతం, ప్రపంచంలో సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. గుర్తింపు సాధించేందుకు అవసరమైన అన్ని ముందస్తు షరతులను తాము పూర్తి చేశామని, ప్రపంచం ఏదో ఒక విధంగా తమకు గుర్తింపునిస్తుందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్లో అన్ని దేశాల దౌత్య కార్యాలయాలను పునఃప్రారంభించాలని కోరారు.
తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ను గుర్తించడంపై అంతర్జాతీయ సమాజం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే పాకిస్థాన్లోని ఆఫ్ఘనిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ దౌత్యవేత్తల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరో నెలలో ఆఫ్ఘన్లోని తమ దౌత్య కార్యాలయాలను పునఃప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిసింది. తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలను పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.