భక్తులకు ఇబ్బంది కలగొద్దు : తలసాని
ABN , First Publish Date - 2021-09-17T17:42:57+05:30 IST
భక్తులకు ఇబ్బంది కలగకుండా గణేష్ శోభాయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ ప్రభుత్వ విభాగాలకు సూచించారు. నిమజ్జనానికి అడ్డంకులు తొలగిన
హైదరాబాద్ సిటీ: భక్తులకు ఇబ్బంది కలగకుండా గణేష్ శోభాయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ ప్రభుత్వ విభాగాలకు సూచించారు. నిమజ్జనానికి అడ్డంకులు తొలగిన నేపథ్యంలో మహానిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్బోర్డు, ఆర్అండ్బీ, టీఎ్సఎ్సపీడీసీఎల్ తదితర విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్రేటర్తోపాటు శివారు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల పరిధిలోని 25 చెరువులు, 25 బేబీ పాడ్స్ వద్ద నిమజ్జనం జరుగుతుందని, ఇందుకోసం 300 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 100 మంది గజ ఈతగాళ్లు సాగర్తోపాటు, నిమజ్జనం జరిగే ఇతర చెరువుల వద్ద అందుబాటులో ఉంటారన్నారు. మండపాల నిర్వాహకులకు వాహనాలను పది ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణకు 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. శోభాయాత్ర మార్గంలో తీగలు, చెట్ల కొమ్మలు అడ్డుగా లేకుండా తొలగించాలన్నారు. నిమజ్జన వీక్షణకు వచ్చే వారి కోసం నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతా బాద్, సంజీవయ్య పార్కు, జేమ్స్ స్ర్టీట్, బేగంపేట రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్టు చెప్పారు.