TS News: నయీం అనుచరుడు శేషన్న దందాలపై కొనసాగుతున్న విచారణ
ABN , First Publish Date - 2022-09-27T18:41:28+05:30 IST
నయీం ప్రధాన అనుచరుడు శేషన్న దందాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad): పోలీసుకాల్పుల్లో మరణించిన గ్యాంగ్స్టర్ నయీం (Naeem) ప్రధాన అనుచరుడు శేషన్న (SHeshanna) అలియాస్ రామచంద్రుడును.. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శేషన్న దందాలపై విచారణ జరుపుతున్నారు. అజ్జాతంలో ఉండి ఆయుధాలు అమ్మిన శేషన్న.. హైదరాబాద్లో ముగ్గురికి ఆయుధాలు ఇచ్చినట్లు తెలియవచ్చింది. హుమాయున్నగర్లో అక్బర్కు ఆయుధాలు విక్రయించాడు. కొద్ది రోజుల క్రితం అక్బర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్బర్ ఇచ్చిన సమాచారంతో శేషన్నపై పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం రాత్రి కొత్తపేటలో అదుపులోకి తీసుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శేషన్న అజ్ఞాతంలో ఉండి పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు గుర్తించారు.
2016లో నయీం మృతి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శేషన్నపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే, హుమాయున్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు.. సోమవారం కొత్తపేట ప్రాంతంలోని ఓ హోటల్లో అతడు సెటిల్మెంట్ చేస్తున్నట్లు తెలుసుకుని, అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం శేషన్నను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.