తాగునీటి ఎద్దడికి చెక్
ABN , First Publish Date - 2021-05-12T06:08:50+05:30 IST
వేసవి మంచినీటి ఎద్దడి నివారించటానికి ప్రతి ఏటా పంచాయతీ చెరువులను గోదావరి, కృష్ణ కాలువల ద్వారా వచ్చే నీటితో నింపుతారు.
434 చెరువులను మంచినీటితో నింపిన అధికారులు
ఇంకా కొన్ని చెరువులు నింపే అవకాశం
ఏలూరు సిటీ, మే 11: వేసవి మంచినీటి ఎద్దడి నివారించటానికి ప్రతి ఏటా పంచాయతీ చెరువులను గోదావరి, కృష్ణ కాలువల ద్వారా వచ్చే నీటితో నింపుతారు. దీంతో వేసవిలో కూడా ఆయా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తతెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ సారి కూడా వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు మంచినీటి చెరువుల్లో నీరు నింపే కార్యక్రమాన్ని ఆర్డబ్ల్యుఎస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్రమం దాదాపు పూర్తి అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాలువలకు నీరు వస్తుండటంతో అక్కడ కూడా చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ చెరువులు నీటి నిల్వలతో కళకళ లాడుతున్నాయి.
జిల్లాలో 434 మంచి నీటి చెరువులు
జిల్లాలో 434 మంచినీటి చెరువులు ఉన్నాయి. ఇందులో పంచాయతీలకు సంబంధించినవి 404 ఉండగా, ఆర్డబ్ల్యుఎస్ శాఖకు చెందిన చెరువులు 30 వరకు ఉన్నాయి. వీటన్నింటిలో గోదావరి, కృష్ణా కాలువల ద్వారా వచ్చే నీటితో నింపటం జరిగింది. దీంతో రాబో యే రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశా లు తక్కువగా ఉంటా యని చెబుతున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా చెరువులను మంచి నీటితో నింపే కార్యక్ర మాన్ని చేపట్టారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో చెరువుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.
చెరువులను నీటితో నింపాం
జిల్లాలో మంచినీటి చెరువులను నింపాం. వేసవిలో తాగునీటి ఎద్దడిని తట్టుకోవటానికి ముందుగానే ప్రణాళిక రూపొందించి గోదావరి, కృష్ణ కాలువల ద్వారా పంచాయతీ చెరువులతో పాటు తమ శాఖ పరిధిలోని చెరువులను నీటితో నింపాం. ఈ చెరువులు నీటితో నింపటంతో మంచినీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.
–ఏఎస్ఆర్ రామస్వామి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ