తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-05-12T05:16:25+05:30 IST
పంటలకు తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎం.భరతలక్ష్మి సూచించారు.
ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి
అనకాపల్లి, మే 13: పంటలకు తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎం.భరతలక్ష్మి సూచించారు. ప్రస్తుత సీజన్లో చెరకు, కూరగాయల పంటలకు వచ్చే తెగుళ్లు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. చెరకు పైరులో పీకపురుగు ఆశించే అవకాశం ఉందని, దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీమీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ మందును లీటరు నీటిలో ఒక మిల్లీలీటరు మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. వైరస్ తెగుళ్లు అయిన మొజాయిక్, పసుపు ఆకు తెగులు, ప్లెక్తెగులు ఆశించే ప్రమాదం ఉందన్నారు. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీమీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. లేదా డై మిథోయేట్ 1.7 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని ఏడీఆర్ సూచించారు. అలాగే కూరగాయల పంటలకు ఆకుమచ్చ తెగులు ఆశించవచ్చని, దీని నివారణకు కార్బెండిజమ్ ఒక గ్రాము లేదా 2.5 గ్రాముల ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని చెప్పారు.